రజినీకాంత్ సంచలన ప్రకటన.. రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం


Send us your feedback to audioarticles@vaarta.com


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఎప్పుడెప్పుడు పెడతారా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. రాజకీయ ఆగమనంపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తాను రాజకీయాల్లోకి రాబోనని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. తన అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని రజినీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు క్షమాపణ చెబుతూ మూడు పేజీల లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తన లేఖలో రజినీకాంత్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనని ప్రకటించారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. నిజానికి ఆయన ఈ నెల 31న తన రాజకీయ పార్టీ ప్రకటన చేయాల్సి ఉంది. దీనికి ముందే.. ఈ ప్రకటన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇటీవల రక్తపోటులో హెచ్చు తగ్గుల కారణంగా ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ‘అన్నాత్తే’ షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్కు వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోవడం.. ఈ క్రమంలోనే ఆయన ఆసుపత్రి పాలవడం జరిగిపోయాయి.
కాగా.. రజినీకాంత్ను డిశ్చార్జ్ చేసే సమయంలో వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారు. వారంపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలని తెలిపారు. ఏదో ఒక చిన్న చిన్న వ్యాయామం చేస్తూ ఉండాలని సూచించారు. ఒత్తడిని తగ్గించుకోవాలని... అలాగే.. కోవిడ్-19 కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గతంలో అయినందున మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు రజినీకి సూచించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచన మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేయకూడదనే నిర్ణయానికి రజినీ వచ్చినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.