హైడ్రాకు అదనపు బాధ్యతలు


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణలో సూపర్ సక్సెస్ అయిన హైడ్రా వ్యవస్థకు అదనపు బాధ్యతలు అప్పగించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇకపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుక లారీలు అక్రమంగా తిరిగితే హైడ్రా వాటి పని పడుతుంది. ఈ విషయంలో విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కూడా హైడ్రా కిందనే పనిచేస్తాయి.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ తాత్కాలిక ఇసుక రీచ్ లు ఏర్పాటుచేస్తున్నారు. నదుల నుంచి ఎక్కువగా ఇసుక వచ్చేది హైదరాబాద్ కే. ఇకపై రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక లారీలు తిరిగితే ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి.
అన్ని ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కోణంలో కెమెరాలు ఏర్పాటుచేయాలని, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక లారీలన్నింటికీ జీపీఎస్ అనుసంధానం చేసి, ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో గనులు, ఖనిజాభివృద్ధి శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. నిర్ణీత ధరకే ఇసుక అందేలా ఏర్పాట్లు చేయాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టి, ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments