close
Choose your channels

Purandeswari:సందు దొరికితే జగన్‌పై బురద జల్లాలనే.. తెలిసీ తెలియకుండా ఆ మాటలేంది చిన్నమ్మ

Sunday, September 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా వుంది ఏపీ కొత్త బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. కీలకమైన ఎన్నికలకు ముందు సోము వీర్రాజును తప్పించి ఆమె చేతిలో పార్టీని పెట్టారు ఢిల్లీ పెద్దలు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కావడంతో పురంధేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అధికార పార్టీని , సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే మరిది చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిపోవడంతో చిన్నమ్మ బాధ అంతా ఇంతా కాదు. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే పాత వైరాన్ని సైతం మరిచిపోయి ఖండించేశారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే వున్నారు.

నరసాపురంలో మద్యం షాపు ముందు చిన్నమ్మ హల్‌చల్ :

ఇప్పుడు చిన్నమ్మ చూపు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పడింది. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ .. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నరసాపురంలో బీజేపీ మహిళా నేతలతో కలిసి మద్యం బాటిళ్లను నడిరోడ్డుపై పగులగొట్టి హల్‌చల్ చేశారు. తాను తనిఖీకి వెళ్లిన మద్యం దుకాణంలో రూ.లక్ష మద్యం అమ్మకాలు జరిగినా కౌంటర్‌లో కేవలం రూ.700 బిల్లు మాత్రమే చూపిస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రూ.700 మాత్రం ప్రభుత్వానికి చెల్లించి మిగతా డబ్బంతా బ్లాక్‌లో తరలిస్తున్నారంటూ ఏపీ బీజేపీ చీఫ్ ఆరోపించారు. ఈ పాయిట్ పట్టుకుని ఆ రోజుకు డ్రామా నడిపించేశారు. ఓ ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌పై వున్నవి లేనివి చెప్పి దుష్ప్రచారం చేశారు.

డిజిటల్ , నగదు చెల్లింపులను ఖజానాకు జమ చేయాల్సిందే :

ఇక్కడే చిన్నమ్మ ఆజ్ఞానానికి నవ్వొస్తోంది. మద్యం షాపు వద్దకు పురంధేశ్వరి వెళ్లే సమయానికి రూ.700 మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగాయి. ఆ రోజు మొత్తం వ్యాపారంలో నగదు, డిజిటల్ రూపంలో రూ.2,60,330 చెల్లింపులు జరిగాయి. దీనిని మద్యం షాపులోని సిబ్బంది రాష్ట్ర ఖజానాకు జమచేశారు. ఇది ప్రతినిత్యం జరిగే ప్రక్రియే. ఆ మాత్రం కూడా తెలియకుండానే పురంధేశ్వరి కేంద్రమంత్రిగా ఎలా చేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈమెను నమ్ముకుని బీజేపీ అధిష్టానం రాష్ట్ర పార్టీని చేతుల్లో ఎలా పెట్టిందని కౌంటర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా చిన్నమ్మ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చురకలంటిస్తున్నారు.

కేజీహెచ్‌కెళ్లి జగన్‌పై బురద జల్లే యత్నం :

ఇది చాలదన్నట్లుగా శనివారం విశాఖలోని కేజీహెచ్‌లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ వార్డును సందర్శించిన పురంధేశ్వరి అక్కడ లివర్ వ్యాధికి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి , ఆరోగ్య వివరాలను ఆరా తీసి అక్కడి నుంచి వచ్చేస్తే గౌరవంగా వుండేది. కానీ ఇక్కడా చిన్నమ్మ జగన్‌పై బురద జల్లాలని ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగడం వల్లే మీ లివర్ పాడైపోయిందా అంటూ అక్కడి రోగులను ప్రశ్నించారు. ఈ మాటలకు రోగులు, వైద్యులు, సిబ్బంది అవాక్కయ్యారు.

జగనన్న మద్యం వల్లే లివర్లు పాడయ్యాయట :

అంతేకాదు.. మద్యం తాగడం వల్ల 39 మంది రోగుల ఆరోగ్య పరిస్ధితి విషమంగా వుందని.. వారిలో 52 మంది వార్డుల్లో చికిత్స పొందుతున్నారని పురంధేశ్వరి మీడియాతో చెప్పారు. అయితే వాస్తవంలో ఆమె చెప్పింది తప్పని తేలింది. అక్కడ మొత్తం 52 పడకలుంటే.. 36 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కానీ పురంధేశ్వరి మాత్రం అందుకు విరుద్ధంగా అవాస్తవాలు మాట్లాడి దొరికిపోయారు. ఇలా ప్రతి విషయంలో ఆమె తన రాజకీయ పరిపక్వతను బయటపెట్టుకుంటున్నారు. ఇకనైనా మారకుంటే చిన్నమ్మ మాటలను ప్రజలు పట్టించుకోరని తెలుసుకుంటే మంచిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.